రూ. కోటి విలువైన ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సిపిఐ ధర్నా
న్యూస్తెలుగు/వనపర్తి : పానగల్ మండలం తెల్ల రాళ్లపల్లిలో రూ. కోటి విలువచేసే క్రీడా ప్రాంగణం స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ఎర్రజెండాలు, కండువాలు డప్పుల వాయిద్యాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫయాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్, గోపాలకృష్ణ, వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ తదితరులు మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు భూమిని సేకరించి పట్టాలు ఇచ్చి 8 గుంటల భూమిని ప్రజల అవసరాల కోసం (కమ్యూనిటీ పర్పస్) ఖాళీగా పెట్టిందన్నారు. మూడేళ్ల క్రితం ఆ స్థలం లో ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి ప్రాంగణం చుట్టూ చెట్లను నాటారన్నారు. కోటి రూపాయల విలువైన భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన వ్యక్తులు క్రీడా ప్రాంగణం నేమ్ బోర్డును కూల్చివేసి చెట్లను నరికేసిన ఇంతవరకు వారిపై చర్యలు లేవన్నారు. ఎమ్మార్వో ఎంపీడీవో తదితర అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు చెబుతున్న ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. హైడ్రా పేరుతో సీఎం ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు తీసుకుంటుండగా పానగల్ మండల అధికారులు ప్రభుత్వ క్రీడా ప్రాంగణం కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న చర్యలు తీసుకోకపోవడం నిందితులతో అధికారులు కుమ్మక్కయ్యారని అనుమానం ప్రజల్లో కలుగుతోందన్నారు. ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు దక్కేలా పోరాటాలు చేస్తామన్నారు. క్రీడా ప్రాంగణం పునర్వించేదాకా పోరాటం ఆపమన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. క్రీడా ప్రాంగణం స్థలం సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఆర్డీవో కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకువెళ్తామన్నారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంక గోపాల్ ఆధ్వర్యంలో కళాకారులు పాటలు పాడారు. తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి, సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మండల కురుమయ్య, కమ్మావుల పెంటయ్య, లక్ష్మీనారాయణ, కురువ హనుమంతు, సహదేవుడు, వెంగలాయిపల్లి బాలస్వామి, పరంధాములు, వేమన్న, శివకాకం వెంకటమ్మ, కాకం శంకరమ్మ, అంజనమ్మ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : రూ. కోటి విలువైన ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సిపిఐ ధర్నా)