గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర
రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆరోపణ
న్యూస్ తెలుగు/సాలూరు: తెలుగుదేశం ప్రభుత్వం 1/70 చట్టాన్ని తొక్కిపెట్టి గిరిజన ప్రాంతాలను బడా వ్యాపారస్తులకు, పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ఈ ప్రభుత్వం చూస్తుందని, గిరిజలంతా ఏకమై ఈనెల 11, 12 గిరిజన సంఘాలు ఇచ్చిన బంద్కు అందరూ సంపూర్ణ మద్దతు పలికి అధిక సంఖ్యలో పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమతా ఎన్జీవో సుప్రీం కోర్ట్ ద్వారా గిరిజన భూమి రక్షణ కోసం తీసుకొచ్చిన జడ్జిమెంట్ నే సమతా జడ్జిమెంట్ అని పిలుస్తారని అన్నారు.
సుప్రీంకోర్టు 1997లో జడ్జిమెంట్ ని ఇచ్చిందని. ఈ విధంగా సమతా జడ్జిమెంట్ ప్రకారం గిరిజన షెడ్యూల్డ్ ప్రాంతం నుండి 1 సెంట్ భూమి తీసుకోవాలని వున్నా సంబంధిత గ్రామా సభ తీర్మానం మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి తీర్మానం తప్పని సరిగా తీసుకోవాలని అన్నారు.
తెలుగు దేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాన్ని అణగదొక్కాలని చూస్తుందని, ఇందులో భాగంగానే 1/70 చట్టాన్ని తొక్కిపెట్టి గిరిజనుల ప్రాంతాలను వ్యాపారులకు , పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు.. ఈ విషయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటలు ద్వారా స్పష్టంగా అర్ధం అవుతుందని దీనిని గిరిజనులందరూ గ్రహించుకోవాలని అన్నారు.
గతంలో అనగా 2 వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వున్నప్పుడు కూడా ఈ 1/70 చట్టాన్ని మార్చాలని ప్రయత్నం చేసారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేన పార్టీ లతో కలిసి గిరిజనులకు (కొండలు ) కు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గిరిజనులకు అండగా భారత రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్డ్, ఆర్టికల్ 244 మరియు 1997 లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన సమతా జడ్జిమెంట్ వున్నదని తెలిపారు. కాబట్టి నిజమైన గిరిజనులు, గిరిజన సంఘాలు, నిజమైన గిరిజన నాయకులు, నిజమైన గిరిజన MLAలు, నిజమైన గిరిజన మంత్రులు , అదేవిధంగా గిరిజన శ్రేయోభిలాషులు ఫిబ్రవరి 11, 12న అనగా మంగళవారం, బుధవారం ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతంలో తలపెట్టిన బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేయజెసి ఈ బంద్ను విజయవంతం చేయాలని సాలూరు నియోజకవర్గం గిరిజనుల తరుపున కోరుతున్నానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు నెమలి పిట్ట కళ్యాణ్, కౌన్సిలర్ సింగరపు ఈశ్వరరావు, వైసిపి నాయకులు పిరిడి రామకృష్ణ, మద్దిల గోవిందా, తాడ్డి శంకరరావు, శివరాంపురం సర్పంచ్ జార్జాపు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. (Story: గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర)