పశువులు రహదారులపై సంచరిస్తే గోశాలకు తరలింపు తథ్యమే
న్యూస్తెలుగు/వినుకొండ : వినుకొండలో ప్రజల భద్రత మరియు పరిశుభ్రతను కాపాడటం లక్ష్యంగా ఆవులను పట్టి సంరక్షించాలని పట్టుకున్న ఆవుల యజమానులు రాని యెడల వాటిని శ్రీశైలం గోశాలకు తరలించాలని గౌరవ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు గారి ఆదేశం మేరకు వినుకొండ మున్సిపాలిటీ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆవులను మునిసిపల్ సిబ్బంది ద్వారా తోలుకొని వచ్చి మునిసిపల్ ప్రాంగణంలో బంధించి అచ్చంగా ఇద్దరు మేస్త్రీలను ముగ్గురు వర్కర్స్ ను కేటాయించి కూరగాయలతో పశుదాణాతో సమయానికి నీళ్లు అందిస్తూ పారిశుధ్యం పాటిస్తూ ఆవుల యజమానుల కన్నా మిన్నగా పోషణ చేస్తున్నామని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న కొందరు పశువుల యజమానులు మొదటి తప్పిదముగా మన్నించమని కోరి ఈ పనులను పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చి కనీస అపరాధ రుసుము చెల్లించి తమ ఆవులను కోడెదూడలను తరలించుకున్నారని తెలిపారు.రోడ్లపై సంచరించే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పశువులను మునిసిపల్ ప్రాంగణంలో తరలించి వాటి సంరక్షణ బాధ్యతలను పురపాలక సంఘం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. పశువులను యజమానులు వాళ్ల ప్రాంగణాలలోనే ఉంచుకోవాలని, రోడ్లపై వదిలితే తప్పనిసరిగా వాటిని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. పశువుల యజమానులకు గతంలోనే హెచ్చరిక నోటీసులు జారీ చేసి ఉన్నామని, మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించి ఉన్నామని తెలిపారు.దీన్ని అతిక్రమించి పశువులు రోడ్లపై సంచరించినచో వాటిని పట్టి శ్రీశైలం గోశాలకు సురక్షితంగా తరలించడానికి ఏర్పాట్లు చేయుచున్నామని కమీషనర్ తెలిపారు.ఈ చర్యల వల్ల పశువులను సంరక్షించడం మరియు రక్షించడం, వాటి శ్రేయస్సును నిర్ధారించడం,సంభావ్య ప్రమాదాలను తగ్గించడం మరియు పర్యావరణ సమస్యలను నివారించడం వంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొనెదమని కమీషనర్ తెలిపారు.పట్టణ ప్రజల మరియు పాలకుల పిర్యాధుల మేరకు ఈ ఆవులను శ్రీశైలం గోశాలకు తరలించడం ద్వారా, పట్టణంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని మరియు జంతు సంక్షేమాన్ని కాంక్షిస్తున్నామని కమీషనర్ తెలిపారు. (Story : పశువులు రహదారులపై సంచరిస్తే గోశాలకు తరలింపు తథ్యమే )