కొల్లేరు ప్రాంతంలో సీపీఐ బృందం
న్యూస్తెలుగు/ఏలూరుః ఏలూరు జిల్లా లోని కొల్లేరు సరస్సు ముంపు ప్రాంతాలను మంగళవారంనాడు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం పర్యటించి, పరిశీలించింది.
ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం పరిధిలోగల పెద్దఎడ్లగాడి గ్రామం లోని బ్రిడ్జి వద్ద నుండి కొల్లేరు వ్యూ పరిశీలించిన అనంతరం కొల్లేరు సరస్సును ముంచెత్తుతున్న వరద నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి పారుదల శాఖ, డ్రైనేజీ, అటవీ శాఖాధికారులు వారికి పూర్తి వివరాలను అందజేశారు. తదనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ కొల్లేరు సరస్సును 120 జీవో ప్రకారం ఐదో కాంటూరు లోపు అభయారణ్యం క్రింద పరిరక్షించాల్సిన బాధ్యత టిడిపి ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కొల్లేరు సరస్సు కాలుష్యానికి గురికాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు సరస్సుకు ప్రపంచ స్థాయిలో పేరు ఉందని, ఈ సరస్సును పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. అనంతరం హనుమాన్ జంక్షన్ మీదుగా కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో గల పుట్టగుంట్ల బయలుదేరి వెళ్లారు. నారాయణ వెంట రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఇతర జిల్లా నాయకులు ఉన్నారు. (Story : కొల్లేరు ప్రాంతంలో సీపీఐ బృందం)