భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు
– స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు కోరిన్నని లడ్డూలు
– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
న్యూస్తెలుగు/ తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, – శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది.
– గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించాం. తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టి, స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, దర్శనం టోకెన్లు లేనివారికి ఆధార్ కార్డుపై రోజువారి రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
– అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి మేము పంపలేకపోయాము. ప్రస్తుతం పంపిస్తున్నాం. గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు పంపబడ్డాయి. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ.50/- ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు (స్టాక్ లభ్యత ఆధారంగా) అందజేస్తున్నాం. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు.
– ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు, సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నాం. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది.
– ముఖ్యంగా నెయ్యి యొక్క నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నెయ్యి కల్తీనా కాదా తెలుసుకునే దానికి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టిటిడికి ఒక గ్యాస్ క్రోమాటోగ్రాఫ్ మరియు హెచ్పిఎల్సిని విరాళం అందిస్తామని తెలిపారు. దీని ధర సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరుస్తారు.
– అన్నప్రసాదం నాణ్యతను మెరుగుపరిచేందుకు, ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుంది.
– అదేవిధంగా, శ్రీవారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక 15 రోజులలో వస్తుంది. నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపడతాం.
– కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాలమండపం వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయు కౌంటర్లు మరియు గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.
– జూన్ నెల మొదటి వారంలో యాత్రికులకు వారానికి 1.05 లక్షల ఎస్ఎస్ డి టోకెన్లు ఇవ్వగా, ఇప్పుడు వారానికి 1.63 లక్షల టోకెన్లు జారీ చేస్తున్నాం. ఎస్ఎసడి టోకెన్స్ పెంచిన కారణంగా ఈ టోకెన్ పొందిన భక్తుల నిరీక్షించే సమయం గణనీయంగా తగ్గింది.
– నారాయణగిరి షెడ్ల వద్ద క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లు క్రమబద్ధీకరించి, వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నియమించాము.
– అన్నప్రసాదం ట్రస్ట్ను మెరుగుపరచడానికి, మరింత బలోపేతం చేయడానికి కొన్ని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఈ నిపుణుల కమిటీ సూచనల మేరకు మేము చర్యలు తీసుకుంటున్నాం.
– అన్నప్రసాద విభాగాన్ని ఆధునికరించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు త్వరలో బెంగళూరుకు, హైదరాబాద్ కు చెందిన నిపుణులు తిరుమల లోని వివిధ అన్నప్రసాద కేంద్రాలను సందర్శించనున్నారు.
– వీరందించే సూచనల మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అన్నప్రసాద విభాగాన్ని శాశ్వతంగా సంపూర్ణ స్థాయిలో ఆధునికరిస్తాం.
– తిరుమలలో 25.08.2024 నుండి 30.08.2024 వరకు శ్రీవారి ఆలయం, వసతి గృహాల సముదాయాలలో బొద్దింకలు మరియు ఎలుకల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున స్టీపుల్ & హడ్సన్ బృందాలతో నిర్మూలన చర్యలు చేపట్టాం. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది.
– శ్రీవారి భక్తుల నుదుటన పవిత్రమైన ”తిరునామం” ధారణ కార్యక్రమం, తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలలో ఈ రోజు నుండి పునఃప్రారంభిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఏస్వో శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు)