డోసు పెంచిన కేసీఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తనదైన శైలిలో డోసు పెంచారు. మోడీ విధానాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ సహజంగానే ఆరు మాసాలకోసారి మోడీని తిడుతూవుంటారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి రాజీపడుతూ వుంటారన్న ఆరోపణలు వున్నాయి. కానీ ఈసారి మోడీ సర్కారు దిమ్మదిరిగిపోయేలా విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రంలో బీజేపీ హవా నెమ్మదిగా పెరగడం, కాంగ్రెస్ కు ప్రజల్లో అభిమానం తగ్గుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని టార్గెట్ చేయడం మినహా వేరే మార్గం లేదని కేసీఆర్ భావించినట్లుగా కన్పిస్తున్నది. అందుకే శనివారం ఆయన భువనగిరి సమావేశంలో మోడీపై విరుచుకుపడ్డారు. ఒక దశలో కాంగ్రెస్కు పరోక్షంగా సపోర్ట్ కూడా చేశారు.
ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది.
వ్యవసాయ బావికి మోటారు పెట్టాలంటున్న ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలి.
ఎనిమిదేండ్ల బిజెపి పాలనలో దేశం సర్వనాశనమైంది.
దేశ రాజకీయాల్లో మొలకెత్తిన కుక్కమూతి పిందే బిజెపి
ఈ దరిద్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే దేశ ప్రజలకు అంత మంచిది.
రైతులను అరిగోస పెట్టడానికి పిచ్చి పాలసీలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మోడీకి తెలంగాణ ఉద్యమ సెగ చూపిద్దాం
రైతులకు వ్యతిరేకంగా మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి దాదాపు ఏడాది కాలం రైతులను ఏడిపించారు.
ఢిల్లీ దగ్గర రైతులను అవమానించారు.
రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చీత్రికరించే ప్రయత్నం చేశారు.
ఓ కేంద్ర మంత్రి ఏకంగా రైతులు ధర్నా చేస్తుంటే వారి మీదికి కారు ఎక్కించి రైతులను చంపడం దుర్మార్గం.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు భయపడి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు.
చివరకు ఏకంగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు.
తెలంగాణలో సొంత పైసలు పెట్టి రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తుంటే కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీని అమలు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి బావి దగ్గర ఉండే మోటారుకు మీటరు పెట్టాలని కేంద్రం మెడ మీద కత్తి పెట్టి ఒత్తిడి తెస్తున్నది.
కానీ ఎట్టి పరిస్థితిల్లో మోటారు దగ్గర మీటరు పెట్టబోం
మరో ఐదారేండ్లు రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని స్థిరీకరించేలా చేస్తాం.
వాస్తవాలు మాట్లాడితే.. “కెసిఆర్ నీ అంతు చూస్తామ అని బెదిరిస్తుండ్రు. కానీ కెసిఆర్ ఎవ్వరికీ భయపడడు. అలా చేస్తే తెలంగాణ వచ్చేదా?
మోడీ సిగ్గు పడాలి. దేశం ఎవ్వడి అయ్య సొత్తు కాదు.
సర్వ నాశనం చేస్తుంటే.. చేతులు మూడ్చుకుని చూస్తూ కూర్చోబోం
జనగామలో మాట్లాడితే.. బిజెపి వాళ్ల లాగులు తడిసినయ్. కెసిఆర్ను పీకీ పారేస్తం. సముద్రంలో నీటి చుక్క అంత అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. కెసిఆర్ను చూసి బిజెపి ఎందుకు భయపడుతుందో చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అవినీతి జరుగుతోంది.
కేంద్ర మంత్రుల అవినీతి చిట్టా నా చేతికి వచ్చింది.
వారి అంతు తేలుస్తా
త్వరలోనే ఆ గుంట నక్కల అవినీతిని బయటకు తీసుకొస్తాం
చాలామంది ఫోన్లు చేసి అవినీతిని బయటపెట్టాలంటూ చెబుతున్నారు.
దేశమంతా తిరిగి ప్రధాని మోడీ సంగతి చెబుతాం.
ఇటీవలే మమతా బెనర్జీ, ఉద్దవ్ థాక్రే, స్టాలిన్లు నాతో మాట్లాడారు.
మోడీకి గర్వం అంత మంచిది కాదు
ఎనిమిదేండ్ల బిజెపి పాలనలో దేశం సర్వనాశనమైంది.
ఏ ఒక్క రంగాన్నీ కేంద్ర ప్రభుత్వం బాగు చేయలేదు.
దేశాన్ని అభివృద్ది చేయమంటే బిజెపి మత పిచ్చిని లేపుతోంది.
పొద్దున లేస్తే లాఠీ ఛార్జీలు.. లూటీ ఛార్జీలు జరిగితే.. పెట్టుబడులు ఏలా వస్తాయి.
యావత్ దేశానికి తలమానికంగా ఉండే బెంగుళూరులోని సిలికాన్ వ్యాలీ ఐటీ రంగంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ నేడు దాన్ని కాశ్మీర్ వ్యాలీగా మార్చేశారు.
కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఆడపిల్లలు, పసికూనల మీద రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.
దేశంలో నిత్యం నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది.
పారిశ్రామిక ఉత్పత్తులు నెలనెలా పడిపోతున్నాయి.
దేశంలో సుమారు 16 లక్షల కంపెనీలు మూతపడ్డాయి.
ఇదేనా మీ పరిపాలనకు తార్కాణం?
ఇలాంటి మత విద్వేశాలు ఎవడి కడుపు నింపుతాయో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి.
ప్రజలంతా గమనించి రాజకీయంగా స్పందించి సరైన తీర్పు ఇవ్వాలి.
లేకుంటే దేశం నాశనమైపోతుంది.
దేశంలో ఆకలి పెరుగుతోంది.
115 దేశాల్లో సర్వే చేస్తే.. ఇండియా 101వ స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు సైతం మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయి.
మరి బిజెపి ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలి.
మోడీ లాక్డౌన్ నిర్ణయం వల్ల దేశంలోని అనేకమంది రోడ్డున పడ్డారు.
స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి పరిస్థితులు ఒక్క మోడీ ప్రభుత్వంలోనే కనిపించాయి.
పవిత్రమైన గంగానదిలో శవాలు తేలుతాయా..? దీనికి ఏం సమాధానం చెబుతారు?
మనం మేల్కోకపోతే.. చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. అందరం కలిసి పోరాడుదాం
గ్రీన్ పవర్ కొనాలే. ఆయన దోస్తులు.. పెట్టుబడిదారులు ఎవరో.. 30 వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడుతడట.. మనం కొనాలట.
నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతలకాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే.. అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి ఆయన తరఫున పెట్టుబడిపెట్టే షావుకార్లు ఇచ్చేదే కొనాలట. దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణ. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తం. లేకుంటే ఇయ్యం. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పిచ్చెక్కి రైతులతో పెట్టుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంగా దీన్ని ఒప్పుకుందమా?
ఫ్రీగా కరెంటు ఇవ్వాలంటే.. మరి ఏం చేద్దాం.. నరేంద్ర మోడీని.. తరిమితిరిమి కొట్టాలి
మాకు ఇవ్వకున్నా పర్లేదు.. ఉన్నంతలో మేం ఇచ్చకుంటామంటే.. అలా ఇవ్వడానికి లేదు అంటున్నారు.. మరి కొట్లాడాలా.. ఇంట్ల పండాలా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బిజెపి ప్రభుత్వం సంస్కారం మరిచి మాటల దాడి చేసింది. రాహుల్ గాంధీతో నాకేం సంబంధం లేకున్నా ఆయన నాన్న, నాన్నమ్మ, తాతలు దేశం కోసం ఎంతో సేవ చేశారు. అలాంటి రాహుల్ గాంధీని పట్టుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాశర్మ ‘నువ్వు ఎక్కడో పుట్టావో.. మేం అడిగామా రాహుల్ గాంధీ’ అంటూ మాట్లాడారు. ఇదేనా బిజెపి సంస్కారం..?
మీకు ఏ మాత్రం సంస్కారం ఉన్నా.. అస్సామ్ ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి.
ఓపికకు హద్దులుంటాయి.. ఏం తమాషా చేస్తున్నారా.. దేశం నాశనమైపోతే ప్రజలు ఉరుకుంటారా..?
న్యాయంకోసం పోరాడేందుకు తెలంగాణ రాష్ట్రం పులిలా ముందుంటుంది.
అది తెలంగాణ గడ్డలో ఉండే పౌరుషం.
-ఇదీ కేసీఆర్ ప్రసంగం. దాటిగా ధీటుగానే వుంది. కాకపోతే మరో వారం పది రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లకపోతే…నిజంగానే ఆయన మాటలు నమ్మాల్సిందే. జాతీయ రాజకీయాల్లో మార్పు చూడాల్సిందే. (Story: డోసు పెంచిన కేసీఆర్)
See Also : కోటిస్తే పేరుపెడతా