కండ్రిక ఎస్సీ కాలనీలో 10 రోజులుగా అంధకారం
ట్రాన్స్ఫార్మర్ రిపేర్కు సిబ్బంది లంచం డిమాండ్
సమస్య పరిష్కరించకుంటే విద్యుత్ ఆఫీస్ ముట్టడిస్తాం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామ ఎస్సీ కాలనీలో గత పది రోజులుగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రిపేరు చేయాలని విద్యుత్ సిబ్బందిని కోరగా, ఇంటికి రూ.100 చొప్పున ఇస్తేనే బాగుచేస్తామని, లేకపోతే ఆ ఖర్చులు తాము భరించలేమని, 10 రోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వినుకొండలోని సీపీఐ కార్యాలయానికి చేరుకున్న బాధితులు.. ఈ విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీపీఐ నాయకులు సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. 10 రోజులుగా దళిత కాలనీలో కరెంటు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో, కరెంటు లేక విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, కనీసం ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాడైన ట్రాన్స్ఫార్మర్ను బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కండ్రిక గ్రామస్తులతో కలిసి వినుకొండ విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున, ఎస్.కె. మస్తాన్, దారివేముల మరియబాబు, సుభాని తదితరులు పాల్గొన్నారు.(Story : కండ్రిక ఎస్సీ కాలనీలో 10 రోజులుగా అంధకారం )
