పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి జీవి రూ.10 లక్షల విరాళం
అమరావతిలో సీఎం చంద్రబాబును కలసి చెక్కు అందజేత
న్యూస్ తెలుగు / వినుకొండ : రాజధాని అమరావతిలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, చీఫ్విప్ జీవి ఆంజనేయులు వ్యక్తిగతంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం ఈ మేరకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి రూ. 10 లక్షల చెక్కును అందించారు. అనంతరం జీవి మాట్లాడుతూ . రాష్ట్రప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అమరజీవి 58 రోజులు దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమైన విషయమన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా స్మృతి వనాన్ని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో తనవంతుగా ఏదైనా చేయాలని విరాళం అందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు ప్రజలగుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఆయన త్యాగం వల్లే తెలుగువారి ఉనికికి గుర్తింపు, గౌరవం, మర్యాదలు లభించాయన్నారు. ఆ మహనీయుని స్మృతిని కలకాలం నిలిపేలా, ఆయన ఆశయాలు తరతరాలకు అందించేలా అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చారిత్రక అవసరంగా కూడా పేర్కొన్నారు. ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపునిచ్చేలా అమరావతి రూపుదిద్దుకుంటోందని, అదే క్రమంలో చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదలకు ప్రతీకగా నగర నిర్మాణం సాగుతుండడం సంతోషించాల్సిన విషయమన్నారు. తెలుగుజాతికి వెలుగుబాటలు చూపిన స్ఫూర్తిప్రదాతలకు గౌరవం ఇవ్వడం అంటే, అది రాష్ట్రానికే గౌరవమని స్పష్టం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో అందరు భాగస్వాములు కావాలని చీఫ్విప్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. (Story:పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి జీవి రూ.10 లక్షల విరాళం)

