భూ భారతి చట్టం చాలా విశేషమైనది ..
ప్రజలందరూ చట్టాన్ని అవగాహన చేసుకోవాలి
న్యూస్తెలుగు/వనపర్తి : ఎన్నికల సందర్భంగా అప్పటి పి.సి.సి. అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ధరణి వల్ల రైతులు అనుభవిస్తున్న కష్టాలను చూసి ఎన్నికల్లో గెలిపిస్తే మాయదారి ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు తమ ఓటు వేసి గెలిపించారని, అందుకు అనుగుణంగా 14 నెలల్లో ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందనీ శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు మండలంలోని కంచిరావు పల్లి రైతువేదిక, శ్రీరంగాపూర్ మండలంలోని కామన్ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం – 2025 అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూమిని మాయం చేసి తీసుకొచ్చిన మాయదారి ధరణి చట్టాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళ ఖాతంలో వేయడం జరిగిందని, ధరణి స్థానంలో రైతులకు మేలు చేసే రైతు పక్షపాతి అయిన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. ధరణి చట్టం ప్రకారం తహసిల్దార్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే అందులో తప్పులు ఉన్నా, ఏ సమస్య ఉన్న తిరిగి సరి చేసేందుకు తహసీల్దార్ కు గానీ, ఆర్డీఓ లేదా కలెక్టర్ కు సైతం అధికారం లేకుండా ఉండేదన్నారు. దాదాపు 9.5 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడ్డాయని, సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అయినప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ భూ భారతి చట్టం తీసుకురావడం జరిగిందనీ తెలియజేశారు. పెబ్బేరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, పెబ్బేరు తహసిల్దార్ లక్ష్మీ, శ్రీరంగాపూర్ తహసిల్దార్ మురళి, ఎంపీడీఓ రవీందర్ , మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులు, ప్రజలు పాల్గొన్నారు. (Story:భూ భారతి చట్టం చాలా విశేషమైనది .. )

